ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరు. కోలన్ ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతూ ఆయన మంగళవారం రాత్రి మరణించారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ముంబైలోని కోకిలాబెన్ ధిరూభాయ్ హాస్పిటల్కు తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించడం సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇర్ఫాన్ ఖాన్ వయసు 54 ఏళ్లు. 2018లో ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ వ్యాధి నుంచి బయటపడటానికి ఆయన లండన్లోని ప్రముఖ హాస్పిటల్ చికిత్స పొందారు. కొన్ని నెలల చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేశారు. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజీ మీడియం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే కరోనావైరస్ ముప్పుతో లాక్డౌన్ ప్రకటించడంతో థియేటర్ల నుంచి సినిమాను ఎత్తేశారు. తాజాగా డిస్నీ హాట్ స్టార్ యాప్లో వరల్డ్ ప్రీమియర్ను ప్రదర్శించారు. హాట్స్టార్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కిన విషయం తెలిసిందే.
ఇర్ఫాన్ ఖాన్కు భార్య సుతాపా సిక్దర్, బాబిల్, ఆయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇర్ఫాన్ ఖాన్ పలు ప్రాంతీయ భాషల సినిమాల్లోనూ నటించారు. మహేశ్ బాబు నటించిన సైనికుడు సినిమాలో ఆయన విలన్గా నటించారు. ఇర్ఫాన్ 2011లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ మృతిని దర్శకుడు షుజిత్ సర్కార్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ధృవీకరించారు. నా ప్రియమైన స్నేహితుడు ఇర్ఫాన్ ఖాన్. పోరాటం.. పోరాటం.. పోరాటం నీ ఆయుధంగా మారింది. అందుకు నేను గర్వపడుతున్నాను. మళ్లీ మనం కలుసుకొందాం. భార్య సుతాప, కొడుకు బాబిల్కు నా తీవ్ర సంతాపం.. మీరు కూడా ఇక ఎనలేని పోరాటం చేయాలి. పోరాటం చేయడానికి ఆయన అన్ని నీకు ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇర్ఫాన్ ఖాన్కు సెల్యూట్ అని ట్వీట్లో పేర్కొన్నారు.