సినిమా టైటిల్ వివాదంలో ఖిలాడీ చిక్కుకుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల అయింది. ఇప్పుడిదే ఈ సినిమాకు పెద్ద సమస్యగా మారింది. ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్.. ‘ఖిలాడి’ చిత్ర మేకర్స్పై కేసు నమోదు చేశారు. ఇదే టైటిల్లో రతన్ జైన్..బాలీవుడ్లో అక్షయ్ కుమార్తో ఇంతకు ముందే చిత్రం చేశారు. . ‘ఖిలాడి’ టైటిల్తో దక్షిణాదిలో సినిమా తెరకెక్కిస్తున్నట్లుగా తనకు తెలియదని, తెలిసి ఉంటే ముందే సంప్రదించి ఉండేవాడినని రతన్ జైన్ తెలిపారు.
‘‘అక్షయ్ కుమార్తో ‘ఖిలాడి’ టైటిల్తో మేము సినిమా చేయడం జరిగింది. అది పెద్ద విజయం సాధించింది. ఇదే టైటిల్తో సౌత్లో చిత్రం చేస్తున్నట్లుగా నాకు తెలియదు. తెలిసి ఉంటే ముందే సంప్రదించేవాడిని. మొన్న ట్రైలర్ చూసిన తర్వాతే తెలిసింది. అయినా సరే, నేను డబ్బులు ఆశించడం లేదు. మా ‘ఖిలాడి’ చిత్ర ప్రతిష్ట గురించే ఆలోచిస్తున్నాను అని రతన్ జైన్ అన్నారు. సౌత్లో లోకల్ అసోసియేషన్స్లో టైటిల్ రిజిస్టర్ చేయించి, అదే టైటిల్తో బాలీవుడ్లోనూ ఎలా రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు.
సిబీఎఫ్సీ అనుమతితోనే హిందీ టైటిల్స్కి దగ్గరగా డబ్బింగ్ చిత్రాలను విడుదల చేస్తున్నారు. కానీ ఇక్కడి సినిమాల ప్రతిష్టను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు విడుదలైన ‘ఖిలాడి’ చిత్రం కేవలం సౌత్లోనే విడుదల అనుకున్నాను.. కానీ నార్త్లో కూడా విడుదల చేశారు. అందుకే ఈ సినిమా టైటిల్ను మార్చాలని కోర్టును సంప్రదించడం జరిగింది..’’ అని తెలిపారు. అయితే, ఇప్పటికే సినిమా విడుదలవడంతో.. కోర్టు కూడా ఏమీ చేయలేమని తెలిపింది. దాంతో కనీసం ఓటీటీ రిలీజ్ని అయినా ఆపాలని రతన్ జైన్ కోర్టుని కోరినట్లుగా సమాచారం. అయితే ఈ వివాదంపై రవితేజ ‘ఖిలాడి’ చిత్రయూనిట్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.