మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్టయిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాకు కింగ్ మేకర్ అనే టైటిల్ పెట్టినట్లు కొన్ని రోజులపాటు ప్రచారం జరిగింది. ఆ తర్వాత గాడ్ ఫాదర్ అనే టైటిల్ పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి.
గాడ్ ఫాదర్ అనే టైటిల్ ని మేకర్స్ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయాలనుకోగా అప్పటికే ఆ టైటిల్ రిజిస్టర్ అయిన విషయం తెలిసింది. ఈ టైటిల్ ని డైరెక్టర్ సంపత్ నంది రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుసుకొని మేకర్స్ ఆయనను సంప్రదించారు. చిరంజీవి సినిమా కోసం టైటిల్ కావాలని కోరడంతో ఆయన వెంటనే అంగీకారం తెలిపారు.
ఈ విషయం గురించి చర్చించేందుకు సంపత్ నంది ఇటీవల చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముందుగా ఆ ఫోటో బయటకు రాగానే సంపత్ నంది దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తన గాడ్ ఫాదర్ సినిమా టైటిల్ ను చిరంజీవికి ఇచ్చిన సందర్భంగా కలుసుకున్నప్పుడు ఆ ఫోటో దిగినట్లు తాజాగా క్లారిటీ వచ్చింది. చిరంజీవి మలయాళ రీమేక్ సినిమాకు గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టినట్లు అఫీషియల్ గా ప్రకటన రావాల్సివుంది.
Also Read
హరిహర వీరమల్లు నుంచి స్పెషల్ సర్ప్రైజ్..