ఈ రోజుల్లో అనే చిన్న సినిమాతో సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు మారుతి. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్ సక్సెస్ తో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నాని తో తీసిన భలే భలే మగాడివోయ్, శర్వానంద్ తో తీసిన మహానుభావుడు, సాయి తేజ్ తో చేసిన ప్రతి రోజు పండగే సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. మారుతి ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాడు. ఇప్పటివరకు మాస్ సినిమాల జోలికి పోలేదు.
అలాగే ఎన్ని విజయాలు వచ్చినా మారుతికి అగ్రహీరోల సినిమాలకు దర్శకత్వం వహించి ఛాన్స్ మాత్రం దక్కలేదు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ మారుతికి వచ్చింది అంటూ ప్రచారం జరుగుతోంది. మారుతి చిరంజీవి కోసం మూడు కథలు రాయగా.. ఇటీవల ఆయనను కలిసి వినిపించారట. అందులో ఒక కథ చిరంజీవికి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బాబీ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమా తరువాత తమిళ వేదాళం రీమేక్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి లైనప్ లో ఇన్ని సినిమాలు ఉండగా.. తాజాగా మారుతి దర్శకత్వంలో సినిమా చేసేందుకు చిరంజీవి అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని అంటున్నారు. మరి ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటన రావాల్సివుంది.
Also Read