సినిమాలపై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు గుత్తాధిపత్యంపై దక్షిణాది సినీ పరిశ్రమ కొనసాగిస్తున్న థియేటర్ల బంద్ బుధవారంతో ముగిసే అవకాశం ఉంది. వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) భారీ ధరలు ఉండడంతో సినీ పరిశ్రమలు ఆందోళనలో ఉన్నాయి. దీనికి నిరసనగా మార్చి 2వ తేదీ నుంచి థియేటర్ల బంద్ చేపట్టడంతో ఈ ఉద్యమం తీవ్రమైంది. నిరవధికంగా 6 రోజుల (బుధవారంతో) పాటు బంద్ కొనసాగడంతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది.
ఈ సినీ పరిశ్రమ ఆందోళన నేటితో ముగిసే అవకాశం ఉంది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు, దక్షిణ సినీ పరిశ్రమ వారితో రెండు రోజులు చర్చలు జరిగాయి. రోజు విడిచి రోజు జరిగిన చర్చలు సఫలమయ్యాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్ ఈ శుక్రవారంలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఈ 6 రోజుల థియేటర్ల బంద్తో రోజుకు సినీ పరిశ్రమకు రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు నిర్మాతలు ప్రకటించారు. తాజాగా చర్చలు కొలిక్కి రావడంతో రేపట్నుంచి తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో సినిమా హాళ్లు తెరచుకోబోతున్నాయి.