సిరియా వారిపై మాట్లాడరే..
అందాల తార.. అతిలోక సుందరి శ్రీదేవి మరణ వార్త విషయంలో మీడియా అత్యుత్సాహం అందరూ గమనిస్తూనే ఉన్నారు. భారతదేశంలో తెలుగు మీడియాది ఇంకా ఒక అడుగు ముందుకు ఉండి లేనిపోనివి వండి వడ్డించేస్తుంటాయి. శ్రీదేవి గురించి దుబాయ్లో ఏం జరుగుతుందో తెలియదు… కానీ మీడియా మాత్రం నానా హంగామా.. రభస.. గందరగోళం సృష్టిస్తోంది. ఈ సమయంలో తమకు తోచిన విధంగా స్టోరీలు వేసుకుంటూ ప్రజలకు సందేశం ఇస్తున్నాయి. ఇవన్నీ ఓ హీరోయిన్కు చిర్రెత్తుకొచ్చింది. ఆమెపై నిన్న ఒకలా.. ఈ రోజు ఇంకొలా.. రేపు ఇంకొలా వార్తలు వేస్తారా అని మీడియాపై మండిపడింది. ఇవన్నీ చూస్తుంటే తనకు విసుగు తెప్పించేలా ఉందని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.
అనుమానాస్పద మృతి అంటూ.. ఎవరికి తోచినట్లుగా వారు కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఆల్కహాల్ కారణంగా అంటూ.. బాత్ టబ్లో మునిగిందంటూ.. ఆత్మహత్య అంటూ.. హత్య కోణం అంటూ ఎవరి వాదన వారు వినిపించడంతో హీరోయిన్ శ్రీదివ్య కోప్పడింది. టీఆర్పీల కోసం పాకులాడే ఛానళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా ప్రవర్తన తీరుపై ఆమెకు విసుగు వచ్చేసినట్టు చెప్పుకొచ్చింది.
‘నిన్న వీరంతా (మీడియా) శ్రీదేవి మేడమ్ గొప్పతనం గురించి చెప్పారు. ఇప్పుడు వీరంతా తప్పుల కోసం వెతుకుతున్నారు. మీడియా ఎందుకు ఇలా తయారైంది. అదే మీడియా.. ప్రస్తుతం జరుగుతున్న ఈ దారుణాన్ని ఎందుకు ప్రసారం చేయడం లేదు. ఏం.. ఈ పిల్లలు మనుషులు కాదా’ అంటూ సిరియా ఉదంతంలో వర్ణనాతీతమైన బాధలు పడుతున్న చిన్నారుల వీడియోను పోస్ట్ చేసింది. మరి శ్రీదివ్య ప్రశ్నకు మీడియా ఏమంటుందో..?