ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి మంచి జోరుమీదుంది. ఈ మూవీతో పాటు శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాటిక్ విజయాలు అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి, మాచర్ల నియోజిక వర్గం, ది వారియర్ సినిమాలు చేస్తోంది. తాజాగా తమిళంలో సూర్య సినిమాలో చేసే అవకాశం దక్కించుకుంది కృతిశెట్టి. విభిన్న పాత్రకు పెట్టింది పేరైన కోలీవుడ్ స్టార్ హీరోకిది 41వ మూవీ.
వైవిధ్య కథలతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బాలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. గతంతో వీరి కాంబినేషన్లో పితామగన్ (శివ పుత్రుడు), నంద లాంటి చిత్రాలు విడుదలయ్యాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండటం విశేషం. తనకు విపరీతంగా క్రేజ్ పెరుగుతుండటంతో ఈ సినిమాలో చేసేందుకు కృతిశెట్టి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.
కోటిన్నర ఇస్తేనే సినిమా చేస్తానని చెప్పిందట. మేకర్స్ సైతం ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా అంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఉప్పెన భామ జోరు ఇలాగే కొనసాగితే అతికొద్ది రోజుల్లోనే రెమ్యూనరేషన్ విషయంలో పూజా హెగ్డే, రష్మిక మందన్న సరసన చేరుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.