నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ అనే సినిమాను బయోపిక్గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవల సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. మిగతా నటులు ఎవరెవరు అనేది తెలియడం లేదు.
ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారం కొనసాగుతోంది. ఎన్టీఆర్ జీవితంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాదెండ్ల భాస్కరరావు ఘట్టం కీలకపాత్ర ఉంది. ఆ పాత్రకు బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ను తీసుకున్నారని సమాచారం. తెలుగులో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న పరేశ్ రావల్ భాస్కరరావు పాత్రలో సూటవుతాడని చిత్ర బృందం ఫిక్సయ్యింది.
శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవితో కలిసి లింగం మామ పాత్రతో పరేశ్ నటించారు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో అంతగా కనిపించలేదు. ఇప్పుడు ‘ఎన్టీఆర్’ బయోపిక్లో నటించే అవకాశం ఉంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణువర్థన్ ఇందూరిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగవంతం చేయాలనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారు. వచ్చే 2019 ఎన్నికల నాటికి విడుదల చేయాలని ప్లాన్.