ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ భామ సాయి పల్లవి. ఇక్కడ చేసింది అరడజను సినిమాలే అయినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్పటి వరకు స్టార్ హీరోలతో నటించకపోయినా కూడా ఆమె స్టార్ హీరోయినే. ఆమె నటనతో సినిమా రేంజ్ పెరుగుతుందన్న నమ్మకం ఇటు దర్శక నిర్మాతల్లోనూ.. అటు ప్రేక్షకుల్లోనూ కలిగించింది. నటనలోనే కాదు వ్యక్తిత్వంలోనూ తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది.
అలాంటి హీరోయిన్పై మూడేండ్ల కింద నాగశౌర్య కొన్ని విమర్శలు చేశాడు. సాయిపల్లవి చాలా అన్ ప్రొఫెషనల్ అని విమర్శించాడు. సెట్లో ఆమె వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు అని.. టైమ్ సెన్స్ కూడా లేదంటూ దుమ్మెత్తి పోశాడు. ఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన కణం సినిమాలో నాగశౌర్య, సాయిపల్లవి కలిసి నటించారు. కేవలం దర్శకుడు మాత్రమే కాదు సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కూడా సాయి పల్లవి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అంటూ మీడియా ముందు నాగశౌర్య చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
ఈ విమర్శలకు మూడేళ్ల తర్వాత ఇప్పుడు సమాధానం చెప్పింది సాయి పల్లవి. కణం చిత్ర దర్శకుడు ఎ.ఎల్.విజయ్, కెమెరామెన్ నీరవ్ షాకు ఫోన్ చేసి సెట్లో నా వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం. దానికి వాళ్లు అలాంటిది ఏమీ లేదని చెప్పారట. ఆ తర్వాత సాయి పల్లవి మాట్లాడుతూ నటుడిగా తనకు నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉందంది. తనలో నచ్చని గుణం గురించి ఆయన బయటకు చెప్పారనీ.. కానీ తాను దాన్ని పాజిటివ్గానే తీసుకున్నానని చెప్పింది. నిజంగా సెట్లో తన వల్ల అతనికి ఇబ్బంది కలిగింది అంటే బాధగా ఉందని తెలిపింది. తన సమాధానంతో ఇప్పుడైనా నాగశౌర్య సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నా అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.