తెలుగు బిగ్బాస్ సీజన్ టు మరో 20 రోజుల్లో ముగియనుంది. బిగ్బాస్ షో చివరి అంకానికి చేరింది. బిగ్బాస్ షో చివరి దశకు వచ్చిందంటే.. తీవ్ర ఉత్కంఠ.. ఉద్వేగం.. ఎవరు గెలుస్తారోననే ఆసక్తి అందరిలో ఉంటుంది. అందుకే.. చివరి కొస్తున్న కొద్దీ చూస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కానీ.. ప్రస్తుతం తెలుగు బిగ్బాస్ చివరి దశకు వస్తున్న కొద్ది మజా లేకుండా పోతోంది. దీనికి తేజస్వి అనే ఒకే ఒక్క కంటెస్టెంట్ చేసిన పొరపాటే కారణం. హౌస్లో ఉన్న కౌశల్ అనే ఒకే ఒక్క కంటెస్టెంట్ను తప్ప మరెవరినీ చూసే పరిస్థితి ఉండడం లేదు. పరమ బోరింగ్గా.. చూడాలంటేనే కంపరంగా ఉందంటూ ప్రేక్షకుల నుంచి లక్షల్లో కామెంట్లు, ట్రోల్స్ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. అసలు బిగ్బాస్ సీజన్ టు కంటెస్టెంట్లే బలహీనంగా ఉన్నారంటూ మొదట్లో విమర్శలు వచ్చాయి. పోనీలే ఎవరో ఒకరు చూద్దామని ప్రేక్షకులు ఆసక్తిని పెంచుకుని టీవీల ముందు కూర్చున్నారు. కానీ.. తేజస్వి అనే కంటెస్టెంట్ హౌస్లోనికి ఎంటరైన మొదటి రోజు నుంచే ఓ గ్రూపును ఏర్పాటు చేసింది. ఆ గ్రూపులో తనీష్, సామ్రాట్, బాబూ గోగినేని, దీప్తి సునయన అనే నలుగురిని చేర్చుకుంది. ఇంకేముంది వీరు ఐదుగురూ కలిసి తమను ఎదిరించే వారందరినీ టార్గెట్ చేయడం ప్రారంభించారు. దీంతో 99శాతం మంది వీరికి లొంగిపోయి.. వీరి అడుగులకు మడుగులొత్తడం ఆరంభించారు.
కానీ.. ఒకే ఒక్క కంటెస్టెంట్ మాత్రం వీరిని ఎదరించాడు. గ్రూపులు కట్టడం బిగ్బాస్ రూల్స్కు విరుద్ధమంటూ చెప్పాడు. వారు వినలేదు.. సరికదా కౌశల్ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. బిగ్బాస్ షో స్వభావాన్నే మార్చేయడానికి ఇదే కారణమైంది.
ఐదుగురు కలిసి ఒకడిని వేధిస్తుంటే.. మిగతా పది మందైనా కనీసం అతడికి సపోర్ట్గా నిలబడితే గేమ్లో మజా ఉండేది. కానీ.. మిగతా వారిలో ఎక్కువ మంది జఢపదార్థాల్లాంటి వారే కావడంతో వాళ్లు కూడా కౌశల్నే కార్నర్ చేయడం ఆరంభించారు. అక్కడ జరిగింది అసలు తప్పు. వీళ్లంతా ఒక్కటైనా కౌశల్ వెన్ను చూపలేదు. పైపెచ్చు మరింత ఎదిరించాడు. అదే జనాలకు నచ్చింది. కౌశల్కు బిగ్బాస్ హౌస్లో మద్దతు లేకపోవచ్చు.. మేముంటా మంటూ కోట్లలో అతనికి అభిమానులైపోయారు. అతని తెగువ.. ధైర్యం.. వెన్నుచూపని తత్వం వంటివన్నీ యువతకు నచ్చేశాయి. ఇంకేముంది కౌశల్ ఆర్మీని ఫాం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో కౌశల్ ఆర్మీ అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్గా మారిపోయింది. అంతే.. కౌశల్ను టార్గెట్ చేసే బలమైన కంటెస్టెంట్లు తేజస్వి, భానుశ్రీ, బాబూ గోగినేని, కిరీటి వంటి వాళ్లందరినీ వీళ్లు తమ ఓట్ల ద్వారా బయటకు పంపిచారు. అంతే.. ఎవరైతే షోలో మొదటి నాలుగైదు వారాల్లోనే వెళ్లిపోతారని అంతా భావించారో.. వాళ్లు ఉండిపోయారు. బలమైన కంటెస్టెంట్లు అనుకున్న వాళ్లంతా బయటకు పోయారు. దీంతో షో చివరి దశకు చేరుకున్న సమయంలో హౌస్లో సత్తా ఉండి.. కౌశల్తో కలిసి టైటిల్కు పోటీగా నిలుస్తారనుకునే వాళ్లు ఒక్కరూ లేకుండాపోయారు.
ఇప్పటికీ మారడం లేదు..
హౌస్లో ఆరంభం నుంచి ఇప్పటివరకూ.. వివాదమైనా, ఉద్వేగమైనా, గొడవలైనా.. అన్నింటికీ కేంద్రబిందువుగా కౌశలే నిలిచాడు. ఇంటిలోని వారంతా ఓ పిక్నిక్కు వచ్చినట్టు.. పులిహోర కలుపుకునేందుకు ఉన్నట్టుగా.. ఎక్కడి వారక్కడ సోఫాల్లో కూలబడిపోయి.. చూసేవారికి చిరాకు తెప్పించడానికి తప్ప మరెందుకూ పనికిరావడం లేదు. వారి మధ్యలో ఓ ఆశాకిరణంలా కౌశల్ మారాడు. కానీ.. అతను ఏం చేసినా.. మిగతా వారంతా ఓ గ్రూపుగా మారిపోయి.. విమర్శించడం, తిట్టడం వంటివి ఇప్పటికీ చేస్తుంటే.. జనం భరించలేకపోతున్నారు. 16 మంది సభ్యులు ప్రవేశించిన బిగ్బాస్ హౌస్లో ఇప్పుడు ఎనిమిది మందే మిగిలారు. వీరిలో నామినేషన్ల సమయంలో పడే ఓట్లను చూస్తే.. 70శాతం కౌశల్కు, మిగతా 30 శాతం మిగతా వారికి పడుతున్నాయి. తేజస్వి గ్రూపు కట్టి.. కౌశల్ను వేధించడం చేయకపోతే.. హౌస్లో బలమైన కంటెస్టెంట్లు ఇప్పటికీ ఉండేవారు. షోలో మజా ఉండేది. కానీ.. బలమైన కంటెస్టెంట్ అనేవారంతా బయటకు పోవడం, మిగిలిపోయిన వారంతా ఎప్పుడో వెళ్లిపోవాల్సిన వాళ్లు కావడంతో.. షోలో మజా అంటే కౌశల్. కౌశల్ అంటే మజాగా మారిపోయింది.