కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ఈ సినిమా నుంచి ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలా ముందుగా చెప్పినట్టుగానే, మూడవ పాటగా ‘వచ్చాడయ్యో సామి’ ను కొంతసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది చిత్ర యూనిట్.
వచ్చాడయ్యో సామి .. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి ..’, ఇచ్చాడయ్యో సామి .. కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ’ అంటూ ఈ పాట మొదలవుతోంది. మహేశ్ ను ఉద్దేశిస్తూ జనం పాడుకునే పాటగా అనిపిస్తోంది. ఆ జనంలో ఒకడై మహేశ్ కూడా చిందేస్తాడనే విషయం పోస్టర్స్ ద్వారా అర్థమవుతోంది.
రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది .. జనంలోకి వెళ్లేలా .. జనం నాల్కులపై ఆడేలా వుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ పాటకి మరింత ఊపును తీసుకొచ్చిందనే చెప్పాలి. కష్టంలోని సుఖాన్ని .. కలిసి బతకడంలోని ఆనందాన్ని ఆవిష్కరించేలా వున్న ఈ పాటకి నూటికి నూరు మార్కులు పడిపోతాయని చెప్పొచ్చు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ బాబుకు ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్గా నటిస్తుండగా ఏప్రిల్ 20న భారీ అంచనాలతో ‘భరత్ అనే నేను’ ప్రేక్షకుల ముందుకు రానుంది.