ఏపీ టీడీపీలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ యువనేత లోకేష్ అరెస్ట్ ఖాయం అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యారు లోకేష్. వాస్తవానికి శుక్రవారం నుండి పాదయాత్ర ప్రారంభించాలని టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ తీర్మానించింది.
అయితే కొంతమంది సీనియర్ నేతలు ఈ సమయంలో పాదయాత్ర మంచి కాదని సూచించారట. అలాగే సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాదనలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో పాదయాత్ర మంచిది కాదని పున:ప్రారంభతేదిని వాయిదా వేసుకోవాలని సూచించారట. దీంతో వారి అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేష్ యువగళాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. మరికొన్ని రోజులు అక్కడే ఉండి న్యాయనిపుణులతో పాటు బీజేపీ పెద్దలను కలిస్తే మంచిదని సూచించారట.
అయితే ఏప్రిల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు బయటకు రావడంతో పాటు యువగళం పాదయాత్ర చాలా ముఖ్యం. అయితే లోకేష్ అరెస్ట్ కూడా త్వరలో ఉండనుందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో యువగళం పాదయాత్రను ప్రారంభించాలని తెరపైకి వచ్చినా దాని వాయిదాకే మొగ్గుచూపారు లోకేష్.