ఏపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఇక ప్రధానంగా టీడీపీ అభ్యర్థులకు రెబల్స్ రూపంలో కష్టాలు మొదలయ్యాయి. టికెట్లు రాని నేతలు ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు.
ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో శ్రీకాకుళం, పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు అవకాశాలపై ఇది స్పష్టంగా పడే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
శ్రీకాకుళం అసెంబ్లీకి టీడీపీ గొండు శంకర్ ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే శంకర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. అభ్యర్థిని మార్చకుంటే రెబల్స్గా పోటీ చేస్తామని తేల్చి చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే అది ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి రామ్మోహన్తో పాటు గొండు శంకర్ గెలుపు అవకాశాలపై పడే ఛాన్స్ ఉంది.
2019 లో 6,653 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు రామ్మోహన్. ఇప్పుడు శ్రీకాకుళంలో రెబల్స్ 10 వేల ఓట్లు చీల్చడం ఖాయంగా తెలుస్తోంది. ఇక పాతపట్నంలో టీడీపీ మామిడి గోవందరావు పేరును ప్రకటించగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావుకు టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి టిక్కెట్ నిరాకరించడంతోపాటు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి మారడంపై తూరుపు కాపు సామాజికవర్గం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో అసంతృప్తులు, రెబల్స్ దెబ్బతో టీడీపీకి దెబ్బ పడటం ఖాయమనే తెలుస్తోంది.