ప్రధాని నరేంద్ర మోదీపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు (VH) అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్నటి బహిరంగ సభలో ప్రధాని చేసిన ప్రసంగంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
నిన్న జరిగిన సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని ముస్లింల పార్టీగా పేర్కొనడాన్ని వి.హెచ్ తీవ్రంగా ఖండించారు.ప్రధాని వ్యాఖ్యలు సమాజంలో వివిధ వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, మతపరమైన విద్వేషాలను పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దేశ ప్రధానిగా ఉండి ఒక జాతీయ పార్టీపై ఇలాంటి మతపరమైన వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఆరోపించారు.సామాజిక సామరస్యానికి భంగం కలిగించేలా ప్రసంగించిన ప్రధాని మోదీపై తక్షణమే కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వి. హనుమంతరావు పోలీసులను డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇలాంటి విభజన రాజకీయాలకు పాల్పడటం సరికాదని ఆయన హితవు పలికారు.
కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన అంబర్పేట్ పోలీసులు, దీనిపై చట్టపరమైన సలహాలు తీసుకున్న అనంతరం తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో, ఈ ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది.
