రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ సినిమా హిందీ సినీ పరిశ్రమలో భారీ విజయాన్ని సాధించింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి, ‘పుష్ప 2: ది రూల్’ వంటి పెద్ద సినిమాలను కూడా మించి రికార్డులు సృష్టించింది. గల్ఫ్ దేశాల్లో కొన్ని చోట్ల నిషేధం ఎదురైనా, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఇప్పుడు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) ట్రైలర్ను దర్శకుడు ఆదిత్య ధర్ విడుదల చేశారు. ఈ చిత్రం ఇండియాలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ల్యారి కింగ్ రెహ్మాన్ డకాయిత్ (అక్షయ్ ఖన్నా) మరణంతో పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. అతని మరణానికి ఎస్పీ చౌదరి (సంజయ్ దత్), అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) కారణమని డకాయిత్ గ్యాంగ్ భావిస్తుంది. కానీ నిజానికి అతన్ని హతమార్చింది హమ్జా అలియా మజారి (రణవీర్ సింగ్).
ల్యారీలో నాయకత్వ ఖాళీ ఏర్పడడంతో హమ్జా సింహాసనం అధిష్టించి ‘షేర్-ఇ-బలోచ్’ గా ఎదుగుతాడు. ఉజైర్ బలోచ్ (డానిష్ పాండోర్)తో కలిసి అర్షద్ పప్పు గ్యాంగ్ను ఎదుర్కొంటాడు. అయితే హమ్జాకు మరింత పెద్ద ప్రమాదంగా మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) రూపంలో కొత్త సవాలు ఎదురవుతుంది.
జస్కిరత్ సింగ్ రంగీ అనే వ్యక్తి అయిన హమ్జా ఎందుకు పాకిస్తాన్లోని ల్యారి అండర్వర్ల్డ్లోకి ప్రవేశించాడు? అతని అసలు కథ ఏమిటి? మేజర్ ఇక్బాల్ అతని అసలు గుర్తింపును బయటపెడతాడా? చివరకు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? అనే ప్రశ్నలకు సమాధానాలు మార్చి 19న సినిమా విడుదలైన తర్వాత తెలుస్తాయి.
ఈ ట్రైలర్లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, భారీ విజువల్స్, శక్తివంతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో దర్శకుడు ఆదిత్య ధర్ ఆకట్టుకున్నారు . ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
