టాలీవుడ్ లో ఒక రేర్ కాంబినేషన్ కు సంబంధించి ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన వార్త కావడంతో ఇది మరింత ఆసక్తి కరంగా మారింది.
చరణ్ సినిమాలో నాగార్జున విలన్ గా నటించే అవకాశాలున్నాయనే ఈ పుకార్లు ఆసక్తికరంగా మారాయి. తమిళంలో విజయవంతం అయిన తనీ ఒరువన్ సినిమాను మనోళ్లు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి ఈ సినిమాకు తెలుగులో దర్శకత్వం వహించబోతున్నాడు. తనీ ఒరువన్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్లో తమిళ విలన్ ఒకరు.
తమిళంలో అరవింద్ స్వామి విలన్ గా నటించారు. మరి ఆ సినిమా తెలుగు రీమేక్ లో ఆ పాత్ర ఎవరు చేయబోతున్నారనేది గత కొన్ని రోజులుగా ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకూ ఈ విషయంలో చాలా పేర్లే వినిపించాయి. అరవింద్ స్వామినే తెలుగులోకి తీసుకొచ్చినటింపజేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత నారా రోహిత్ పేరు తెరపైకి వచ్చింది. చరణ్ సినిమాలో రోహిత్ విలన్ గా చేసే అవకాశాలున్నాయని అన్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి నాగార్జున పేరు తెరపైకి వచ్చింది.
రామ్ చరణ్ సినిమాలో ఆయన విలన్ గా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి అదే జరిగితే అంతకన్నా ఆసక్తికరమైన కాంబో మరోటి ఉండదు. ఇంత వరకూ నాగార్జున చాలా మల్టీ స్టారర్లలో నటించాడు కానీ.. విలన్ గా నటించలేదు. అది కూడా ఇప్పుడు చరణ్ సినిమాలో సంభవం అయితే… అంది సంచలనమే అవుతుంది. అయితే కచ్చితంగా అది జరుగుతుందా అనేదే అనుమానం!