కరీంనగర్ జిల్లాలో అరిచే పాము కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. సాధారణంగా ఈ సృష్టిలో వింతలు విడ్డూరాలకు ఏం కొదువేలేదు. పైగా వింత వింత జీవులు పుడతాయని వీరబ్రహ్మం కాలజ్ఞానం లాంటివి మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. జియో గ్రాఫిక్ ఛానల్ లో ఇలాంటి వింతలూ విడ్డూరాలు ఎన్నో చూస్తుంటాం. మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల పాములను చూసింటాం.. కానీ ఇప్పుడు ఓ పాము అచ్చంగా కుక్క, నక్క అరుపులను పోలి ఉండేలా శబ్దాలను చేయడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. రీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మకాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు.
పామును చూసిన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.. అంటూ వెలిచాల గ్రామస్తుడు సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇంకా ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాము అరుస్తున్న సమయంలో సెల్ ఫోన్లతో వీడియో తీయగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ స్పందించారు. ఇదంతా అబద్దమని వెల్లడించారు.
ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ మార్టిన్ అనే యూట్యూబర్ తన ఛానల్లో ‘హోంగోస్ హిట్స్ ద హై నోట్స్’ అనే పేరుతో అప్లోడ్ చేశాడని ఎస్సై వివేక్ తెలిపాడు. దాన్ని డౌన్లోడ్ చేసిన ఓ వ్యక్తి.. వీడియోని వైరల్ చేశాడు. ఆ వీడియోను వెలిచాల గ్రామంలోదిగా పేర్కొంటూ ఆ ఆకతాయి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టు చేశాడని అన్నారు. సదరు యువకుడిని విచారిస్తున్నామని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్సై వివేక్ తెలిపారు. ఇది నార్త్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇది భారత్ లో కనిపించదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.