ఎన్నికల కోడ్ అమలులో భాగంగా తీవ్రంగా జరుగుతున్న పోలీస్ తనిఖీల్లో, విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ లో కొందరు అనుమానితులను గుర్తించారు. వారివద్ద విలువైన లాప్ టాప్ లు, నలభై లక్షలకు పైగా నగదుతో పాటు పలు క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని పత్రాలు, పుస్తకాలు, డైరీల్లో ఎన్నికల బెట్టింగ్ కు సంబంధించిన సమాచారం ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు.
ఏపీ నలుమూలల నుంచీ ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు ప్రాధమిక విచారణలో వెల్లడైంది. ఆంధ్రాలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి కూడా కోట్లల్లో బెట్టింగ్ లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో బెట్టింగులు జోరందుకున్నాయి. ఈ విషయంపై విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు పందేల రాయళ్లను వల వేసి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న డైరీల్లో బెట్టింగ్ లకు సబంధించిన పలువివరాలు బైటపడ్డట్టు సమాచారం.
బెట్టింగ్ గ్యాంగ్ దగ్గర దొరికిన పాకెట్ డైరీల్లో ఏపీ హాట్ సీట్స్ పేరుతో 30 నుంచి 40 నియోజకవర్గాల పేర్లు ఉన్నట్టుగా బైటపడింది. వీటిలో టాప్ లిస్టుగా కడప, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఓటమిపై ఎక్కువ శాతం బెట్టింగ్ సాగుతున్నట్టు పోలీసుల అదుపులో ఉన్న బుకీలు చెబుతున్నారు. ఒకటికి పదింతల వరకూ ప్రముఖులు పోటీ చేస్తున్న సీట్లపై పందాలు సాగుతున్నాయని అంటున్నారు ఐపీఎల్ పందాలను మించి సాగుతున్న ఈ పొలిటికల్ బెట్టింగ్ లను చూసి పోలీసులే నోరు వెళ్లబెడుతున్నార్ట.