ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, సీఎస్, ఈసీ ల మధ్య కోల్డ్ వార్ ముదిరి పాకాన పడుతోంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపధ్యంలో సమీక్షలకు అధికారులు ఎవరూ వెల్లకపోవడంతో బాబు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీంతో ఈసీతో అమీ తుమీ తేల్చుకొనేందుకు సిద్దమవుతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటినుంచి ఎన్నికల కోడ్ అమలవుతోంది. దీంతో బాబు, మంత్రులు వారి శాఖలపై నిర్వహించే సమీక్షలకు ఈసీ కోడ్ అమలులో ఉండటంతో అధికారులు ఎవరూ వెల్లడంలేదు. దీంతో కొద్ది రోజులుగా బాబు, సీఎస్, ఈసీల మధ్య వార్ నడుస్తోంది.
తాజాగా ఫణి తుఫాను బాధితులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలను మీడియాకు వివరించిన చంద్రబాబు సీఎస్, ఈసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికలు నిర్వహించడం వరకే ఈసీ పని అని… సాధారణ పరిపాలన విషయంలో ఈసీ జోక్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మోదీ ఏం మాట్లాడినా ఈసీకి సంగీతం విన్నట్టుగా ఉంటుందని ఆరోపించారు. తాము చాలా ఎన్నికలు చూశామని… తమకే ఇవే మొదటి ఎన్నికలు కావని అన్నారు.
సీఎం దగ్గరకు వచ్చి మాట్లాడాలని సీఎస్ కు తెలియదా? అధికారులు ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే సహించనని హెచ్చరించారు. సీఎస్ ఆ పదవిలో కొన్ని నెలలు ఉంటారు, తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి వాళ్లను చాలా మందిని చూశానని అన్నారు. ‘నేను ఎవరికీ భయపడను. ఎవరి బాధ్యత వారు నిర్వహిస్తే మంచిది?’ అని సూచించారు.
వచ్చే వారం క్యాబినేట్ సమావేశం నిర్వహిస్తానని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని హెచ్చరించారు.హద్దులు దాటితే కేబినెట్ భేటీ నిర్వహించి బిజినెస్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వచ్చే వారం మంత్రివర్గం సమావేశం ఉంటుందని అన్నారు. బాబు వ్యాఖ్యలపై సీఎస్, ఈసీ ఎలా వ్వవహరిస్తోందో చూడాలి.