జల్లికట్టు ఉద్యమం ఇచ్చిన స్పూర్తితో ఏపి యువత.. ఈ నెల 26న విశాఖ ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా సాధించడానికి నడుంకడుతోంది. ఈ ఉద్యమానికి జనసేనాని పవన్ కళ్యాణ్, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ లతో పాటు సినీ టాప్ హీరోలు కూడా మద్దతు తెలిపారు. అసలు ఏపికి ప్రత్యేకహోదా రావడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిధులను … 90% గ్రాంట్లు గాను, 10% అప్పుగాను అందిస్తుంది. గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనక్కర్లేదు.
ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇస్తారు.100% ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఇన్ కమ్ ట్యాక్స్ లో కూడా 100% రాయితీ ఉంటుంది. పన్ను మినహాయింపులు, రీయింబర్స్మెంట్ లు దక్కితే… పారిశ్రామికవేత్తలు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏపీకి తరలివస్తాయి. దీంతో లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకు,యువతీ యువకులకు దక్కుతాయి. కొనుగోలు చేస్తున్న అనేక వస్తువుల ధరలు సగానికి సగం తగ్గుతాయి. ప్రత్యేక హోదా వస్తే ఏపీకి కరెంటు సగం ధరకే 20 ఏళ్ల పాటు లభ్యమవుతుంది.
ఒకొక్క రైతుకు కనీసం ఏడాదికి 10 వేల వరకు వివిధ రూపాలలో సబ్సీడీ వస్తుంది. ఆదాయపన్ను, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ సుంకాల ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయంలో కేంద్రం సుమారు 60 నుంచి 62% ఆదాయాన్ని రాష్ట్రానికి నిధులుగా ఇస్తుంది. ఇప్పటికైనా మేల్కొని జాతి, కులం, వర్గం, పేద, ధనిక అనే అడ్డు గోడల్ని బద్దలుకొట్టి ఏపి భవిష్యత్ కోసం ఆ పోరాటంలో భాగ్యస్వామ్యం అవుదాం.
Related