టీడీపీ, భాజాపా మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఫిరాయింపు నేతలను అనర్హులుగా ప్రకటించాలని మిత్రపక్షం భాజాపా ప్లోర్లీడర్ విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. విష్ణువ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయడు ఘాటుగా విమర్శలు చేశారు. విష్ణు పూటకోమాట మాట్లాడుతున్నారన్న వ్యాఖ్యలు చేశారు.
అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు విష్ణుకుమార్ రాజు. తాను ఎప్పుడు మాట మార్చానో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఒకే మాటపై నిలబడే వ్యక్తినని, వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు దిగేముందు ఒకటికి రెండుసార్లు నిజానిజాలను నిర్ధారించుకోవాలని ఆయనకు వార్నింగ్ ఇస్తున్నానని అన్నారు.
ఒకరి వ్యక్తిత్వంపై విమర్శించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుందని, కానీ అచ్చెన్నాయుడు బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. నీతి, నిజాయతీలతో కూడిన రాజకీయాలను మాత్రమే తాను చేస్తానని, ఆ సంగతిని అచ్చెన్నాయుడికి గుర్తు చేస్తున్నానని అన్నారు.