విజయవాడ: ఏపీలో బీచ్ ఫెస్టివల్పై రాద్దాంతం కొనసాగుతూనే ఉంది. దీనిపై టీడీపీ, వైసీపీలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఈ కోవలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఫ్రిబ్రవరి 12 నుంచి 14 వరకు టీడీపీ ప్రభుత్వం వైజాగ్లో బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్సవంలో ఎటువంటి అశ్లీలతకు తావు ఉండదని ఉమా అన్నారు. సినిమాల్లో నువ్వు(రోజా) బికినీ వేసి డాన్స్ చేసినట్టు కూడా ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమా. తెలింటి ఆడపడుచులు సగర్వంగా తల ఎత్తుకుని చూసేలా ఆ కర్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన అన్నారు.
అయితే అంతకుముందు వైజాగ్లో ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరిట వైసీసీ నిర్వహించిన సభలో రోజా మాట్లాడారు. ఇందులో ఆమె మాట్లాడుతూ.. 40 సంవత్సరాలున్న జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్నారని అన్నారు. అయితే 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటున్న ముసలి నాయకుడు చంద్రబాబు మాత్రం బీచ్లో బికినీ షోలంటూ, లవ్ షోలంటూ చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు రోజా. ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా పైన ప్రస్తావించినట్టు రోజాపై తీవ్ర విమర్శలు చేశారు.