ఏపీసీఎం చంద్రబాబు నాయుడిపై భాజాపానేతలు మాటల దాడిని పెంచారు. తాజాగా ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబు పాలనలో రూ.లక్షకోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గపు పాలన సాగుతోందని.. ఎన్నికల్లో లబ్ధి కోసమే టీడీపీ దుష్ట రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అవినీతి జరుగుతోందన్నారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెబుతూ …వేలకోట్ల రూపాయలు అధికారుల వ్యక్తిగత ఖాతాల్లో వేసిందని విమర్శించారు.కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో రూ.53,039 కోట్ల రూపాయలు మాయమైనట్లు స్వయంగా కాగ్ రిపోర్ట్ చెబుతోందని స్పష్టం చేశారు. ఇది 2జీ స్కామ్ ను మించిన స్కామ్ అని ఆరోపించారు.
ఇంత డబ్బును ఎవరి ఖాతాలో వేశారు..? ఎందుకు వేశారో చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. సాక్షాత్తూ కాగ్నే తప్పు దోవ పట్టిస్తూ వివరాలు సరిగా చెప్పలేదని.. తెలుగుదేశం పార్టీ పర్సనల్ అకౌంట్ల స్కాంను జాతీయ స్థాయిలో వెలుగులోకి తెస్తామని నరసింహారావు స్పష్టం చేశారు. 25 ఎంపీ సీట్ల కోసమే టీడీపీ ఆరాటం.. పోరాటమని విమర్శించారు.