చంద్రయాన్ 2 లో కీలక దశను విజయవంతం చేశారు ఇస్రో శాస్త్ర వేత్తలు. విక్రమ్ ల్యాండర్ ఆర్బిటర్ నుంచి విడిపోయే కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నాం 1:15 గంటలకు ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది. చంద్రయాన్-2లో భాగంగా జూలై 22న నింగిలోకి దూసుకు వెళ్లిన ల్యాండర్ గత నెల 22న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. విడిపడే ప్రక్రియ మిల్లీ సెకన్లలోనే పూర్తయిందని శాస్త్రవేత్తలు తెలిపారు.సెప్టెంబరు 7న చంద్రయాన్-2ను చంద్రుడిపై ల్యాండ్ చేయనుంది.
సెప్టెంబరు 3, 4 తేదీల్లో మరోసారి ల్యాండర్ కక్ష్యను తగ్గించనున్నారు. సెప్టెంబరు 3న ఉదయం 8.45 నుంచి 9.45 మధ్య ఒకసారి, సెప్టెంబరు 4న మరోసారి తగ్గిస్తారు. దీంతో అది 35 × 97కిలోమీటర్ల కక్ష్యలోకి చేరుతుంది. సెప్టెంబరు 7న ల్యాండర్ చంద్రుడి ఉఫరితలం దిగనుంది. ఆ రోజున ల్యాండర్లోని ‘పవర్ డిసెంట్’ దశ ప్రారంభమవుతుంది. ఆ వ్యోమనౌకలోని రాకెట్లను మండించడం ద్వారా దాన్ని కిందకు దించుతారు. ఆ తర్వాత 15 నిమిషాల్లో ల్యాండర్.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతుంది. అది దిగిన తర్వాత… ల్యాండర్ డోర్ తెరచుకుంటుంది. నాలుగు గంటలు తర్వాత అందులోని రోవర్ బయటకు వస్తుంది.ఆ రోవర్… చందమామపై తిరుగుతూ… ఫొటోలు, సమాచారాన్ని ఇస్రోకి పంపుతుంది.