అంతరిక్ష రంగంలో అగ్రదేశాలతో పోటీ పడుతోంది. తక్కు వ ఖర్చుతో అద్భతమైన ప్రయేగాలు చేస్తూ అందరి ప్రశంశలు పొందుతోంది. మరి కొద్ది గంటల్లో అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనతను సాధించనుంది.చంద్రమామ నిగూఢ రహస్యాలను ఛేదించటానికి ఇస్రో పంపిన చంద్రయాన్ 2 చందమామను ముద్దాడనుంది. చంద్రమామరహస్యాలను ఛేదించటానికి భారత అంతరిక్ష సంస్థ చేపట్టిన రెండో ప్రయోగం ఇది.
దేశ ప్రజలు ఉత్కంఠతో దాదాపు 48 రోజు ఎదురు చూపునకు ఫలితం…మరో 16 గంటల్లో అందాల చందమామపై భారత్ పంపిన ‘విక్రమ్’ ల్యాండ్ రోవర్ దిగనుంది. అంతా అనుకున్నట్టు సవ్యంగా జరిగితే ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 నుంచి 2 గంటల మధ్య విక్రమ్ చంద్రుని దక్షిణ ధృవంపై దిగుతుంది.
నాలుగు టన్నుల బరువు ఉన్న ఈ అంతరిక్ష యాత్రలో ఒక లూనార్ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ ఉంటే… దాన్నుంచి విడివడి చంద్రుడి ఉపరితరలం పై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం పని చేస్తుంది ల్యాండర్. ల్యాండర్ చందమామపై విజయవంతంగా కాలు పెడితే… ఆ తర్వాత దాన్నుంచి విడిపోయి పరిశోధనా కార్యక్రమాన్ని చేపడుతుంది రోవర్.
ఆరు చక్రాలు కలిగిన ఈ రోవర్ చంద్రుని ఉపరితలం పై తిరుగుతూ అక్కడి మట్టి, రాళ్ల నమూనాలు సేకరించి అక్కడే రయానిక విశ్లేషణ చేస్తుంది. దీంతో పాటు ఖనిజాల పరిశీలన, మూలకాల లభ్యతను శోధించటం, నీరు, మంచురూపంలోని నీటి లభ్యతను పరిశీలించటం, చంద్రుని వాతావరణ అధ్యయనం వంటి కార్యక్రమాలు కూడా ఈ రోవర్ చేపడుతుంది.ఈ సమాచాన్ని రోవర్ ల్యాండర్కు అందజేస్తే… ల్యాండర్ ద్వారా భూమి పై ఉన్న ఇస్రో అనుసంధానించే కేంద్రానికి చేరుతుంది.
చంద్రుడిపై కాలు మోపే ముందు 15 నిమిషాలే చాలా కీలకంగా మారాయి.ఈ ప్రయోగంలో చివరి ఘట్టమైన సాఫ్ట్ ల్యాండింగ్ ఈరోజు అర్ధరాత్రి తర్వాత జరుగుతుంది. ల్యాండర్లోని కెమెరాలు ప్రతి సెకనుకు అది దిగాల్సిన ప్రాంతంలోని ఫొటోలను పంపుతాయి. వీటిని విశ్లేషించిన అనంతరం ల్యాండర్ దిగాల్సిన చోటును శాస్త్రవేత్తలు నిర్ణయిస్తారు. ఇదే కీలక ఘట్టం.
ల్యాండర్లో ఐదు రాకెట్ ఇంజన్లున్నాయి. వీటిని భూమిపై నుంచే నియంత్రించాలి. ముందు ల్యాండర్ వేగం తగ్గించి, స్థిరత్వాన్ని సాధించి అనంతరం సాఫ్ట్ ల్యాండింగ్కు ఆదేశాలు ఇవ్వాలి. ల్యాండర్ దిగేటప్పుడు 3.6 కిలోమీటర్ల వేగాన్ని దాటకుండా చూడాలి. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. వీటన్నింటినీ ఇస్రో శాస్త్రవేత్తలు ఎలా అధిగమిస్తారన్నదానిపై ప్రయోగం విజయం ఆధారపడి ఉంటుంది.
14 రోజుల పాటు రోవర్ ఈ పరిశోధనా కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ లోపు చంద్రుని క్షక్ష్యలో తిరిగే ఆర్బిటర్ చంద్రుని ఉపరితల ఫోటోలను తీసి ఇస్రో స్టేషన్కు పంపుతూ ఉంటుంది. పదేళ్ళ క్రితం 2008 అక్టోబర్లో చంద్రయాన్ వన్ ప్రయోగించిన సంగతి తెలిసిందే.