రాజకీయ నాయకులు అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉంటాయి. వారు మాట్లాడుతున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయం పక్కనబెడితే..విమర్శలు మాత్రం ఎదురవుతు వుంటాయి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఇదే రీతిలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి. గత పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో ఈ భారీ వర్షాల వల్ల ఆయా ప్రాంతాల్లో వరదలు కూడా సంభావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరదలకు గురైన ప్రాంతాలలో సిఎం కేసిఆర్ ఏరియల్ సర్వే చేశారు. భద్రాచలం లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన తరువాత.. కేసిఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ఈ స్థాయిలో వర్షాలు సంభవించడానికి విదేశీ కుట్ర ఉందని చెప్పుకొచ్చారు.
విదేశాలు కావాలనే భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ బరస్ట్ చేయిస్తున్నాయని, అందులో భాగంగా గోదావరి పరీవాహక ప్రాంతాలపై కూడా ఇలాంటి కుట్రే జరిగిందని వ్యాఖ్యానించారు. అయితే కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను కూడా కేసిఆర్ రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమౌతున్నాయి. వైపరీత్యాలు ఎలా సంభవించయో చెప్పడం మాని, వరదల్లో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోండి అంటూ కొందరు హితభోద చేస్తున్నారు.
ఇదిలా ఉంచితే కేసిఆర్ చెప్పిన క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి అని కొందరు సమాధానం కొరకు ఇంటర్ నెట్ లో వెతికే పనిలో ఉన్నారు ఇంతకీ క్లౌడ్ బరస్ట్ అంటే.. ఏదైనా ఒకే ప్రాంతంలో అనగా ఒకటి నుంచి పది కిలోమీటర్ల లోపు.. ఒక గంటకు 10 సెంటీమీటర్ల లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయితే దాన్ని “క్లౌడ్ బరస్ట్ ” అంటారు. ఈ క్లౌడ్ బరస్ట్ లు ఒకే ప్రాంతంలో ఎక్కువసార్లు కూడా సంభవించవచ్చు. ఇలా క్లౌడ్ బరస్ట్ సంభవించడం వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు 2013 లో ఉత్తరాఖండ్ లో జరిగిన వైపరీత్యాలను చెప్పుకోవచ్చు. .ఏది ఏమైనప్పటికి ప్రకృతి వైపరీత్యాలను విదేశీ కుట్రలుగా కేసిఆర్ అభివర్ణించడం కాస్త విమర్శలకు తావిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈటెల బీజేపీ కి గుడ్ బై ..చెప్తాడా ?