ఫోని పెనుతుపానుగా మారడంతో ఉత్తరాంధ్ర ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే తీర ప్రాంత ప్రజలు ఎవరూ సముద్రంవైపు వెల్లవద్దని ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఆనుకుని తీరానికి 130-140 కిలోమీటర్ల దూరంలో సమాంతరంగా ప్రయాణించొచ్చని వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ప్రధానంగా టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు
తుపాను ధాటికి ఉత్తరాంధ్రలో సముద్రం అల్లకల్లోలంగా మారగా, చాలా ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. భీమిలి, విశాఖపట్టణం బీచ్ల వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. ఆరు మీటర్ల ఎత్తువరకు అలలు ఎగిసిపడుతున్నాయి.
ఫొని’ పెను తుపాను బుధవారం సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా మలుపు తీసుకుని గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది.తుపాను ప్రస్తుతం విశాఖ నగరానికి 320 కిలోమీటర్ల దూరంలోనూ, ఒడిశాలోని పూరీకి 570, పశ్చిమ బెంగాల్లోని దిగాకు 760 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది.తుపాను శుక్రవారం మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
తుపాను తీర దాటే ముందు భారీ విధ్వంసం సృష్టించనుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొన్నిచోట్ల 20 సెంటీమీటర్లకు పైనే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.