జనసేన పార్టీ కమిటీల్లో చోటు దక్కని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అనుకున్నట్టే ఆ పార్టీని వీడేందుకు రెడీ అయ్యారనే వార్త హల్ చల్ చేస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరి విశాఖ ఎంపీగా పోటీచేశారు. ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన కార్యక్రమాలకు పూర్తి దూరంగా జరిగారు.
ఇక పవన్ కొద్దిరోజుల క్రితం పార్టీ బలోపేతం కోసం ప్రకటించిన పార్టీ కీలక పదవుల్లో లక్ష్మీనారాయణకు చోటు దక్కలేదు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారని అందుకే జనసేనాని పవన్ చోటు కల్పించలేదని వార్తలు వచ్చాయి.
ఇక జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ కీలక నేతలతో మంతనాలు జరపడం వల్లే జనసేనాని పవన్ దూరం పెట్టారనే ప్రచారం జరిగింది. తాజాగా పవన్ అనుమానించినట్టే జరుగుతోంది. లక్ష్మీనారాయణ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్టు సమాచారం.
లక్ష్మీనారాయణతోపాటు విశాఖ సౌత్ నుంచి పోటీచేసిన గంపల గిరిధర్ సైతం పార్టీని వీడి లక్ష్మీనారాయణతోపాటు బీజేపీలో చేరాలని డిసైడ్ అయినట్టు సమాచారం అందుతోంది. ఈరోజు లేదా రేపు దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడబోతోందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
టీడీపీని తుత్తునియలు చేసి ఏపీలో బలపడాలని బీజేపీ యోచిస్తోంది. కానీ చంద్రబాబు, జగన్, పవన్ లలాగా బీజేపీని నడిపించే నేత కోసం కమలదళం అన్వేషిస్తోంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ చేరికతో ఆ లోటు తీరినట్టే కనిపిస్తోంది.