హైదరాబాద్ నగరంలో శుభ్రత కోసం అధికారులు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో, ఒక జీహెచ్ఎంసీ సూపర్వైజర్ చేసిన వినూత్న ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గుడిమల్కాపూర్ డివిజన్లోని రామసింగపుర ప్రాంతంలో రోడ్డు పక్కన చెత్త వేస్తున్న ప్రజలను ఆపేందుకు ఆయన ఎంచుకున్న మార్గం హృదయాలను కదిలిస్తోంది.
జీహెచ్ఎంసీ సూపర్వైజర్ మహేందర్ తెల్లవారుజామునే ఆ ప్రాంతంలో నిలబడి, చెత్త వేయడానికి వచ్చే వారిని వ్యక్తిగతంగా కలుస్తున్నారు. ఇక్కడ చెత్త వేయొద్దు… మీ కాళ్లు మొక్కుతా! అంటూ చేతులు జోడించి, కొన్నిసార్లు కాళ్లు మొక్కి మరీ ప్రజలను వేడుకుంటున్నారు. ఆయన వినయపూర్వకమైన ఈ చర్య చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆలోచనలో పడుతున్నారు.
ఈ ప్రాంతంలో చెత్త సమస్య చాలా కాలంగా ఉందని, ఎన్ని సార్లు హెచ్చరికలు ఇచ్చినా, బోర్డులు పెట్టినా, ప్రజలు అలవాటును మార్చుకోలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో శాశ్వత పరిష్కారం కోసం మహేందర్ ఈ విభిన్న మార్గాన్ని ఎంచుకున్నారు.
మహేందర్ ప్రయత్నం కేవలం చెత్త వేయొద్దని చెప్పడమే కాదు, ప్రజల్లో బాధ్యతను పెంచే ప్రయత్నంగా మారింది. ఆయన చర్యలను చూసిన కొంతమంది స్థానికులు ఇకపై చెత్తను రోడ్డు పక్కన వేయబోమని హామీ ఇస్తున్నారు.
