జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 50 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారంటే సైన్యం పట్టుదలతో ఉందో అర్థమవుతోంది. తాజాగా ఉగ్రవాదులకు మరో చావు దెబ్బ తగిలింది. పూల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఈరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది ఆర్మీ.
మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఒకర్ని పాకిస్థాన్ ఉగ్రవాది జకీర్ ముసా ప్రధాన అనుచరుడు, అన్సర్ ఘజ్వతుల్ హింద్కు చెందిన సొలిహ్ మహ్మద్గా గుర్తించారు. అన్సర్ ఘజ్వాతల్ హింద్ ఉగ్రవాద సంస్థ కశ్మీర్లో అల్ఖైదాకు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది.
పూల్వామాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు భద్రతాబలగాలకు నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందడంతో రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీసుల సంయుక్త బలగాలు త్రాల్ లో ఉగ్రవాదులు నక్కిన ఇంటిని చుట్టుముట్టాయి.
అయితే బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు, కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమయిన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే ఉగ్రవాదుల దగ్గర భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని ఓ పోలీస్ అధికారి తెలియజేశారు. మిగిలిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.