హైద్రాబాద్ అత్తాపూర్లో బుధవారం నాడు పట్టపగలే దారుణ హత్య చోటు చేసుకొంది. కొందరు దుండుగులు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మీద గొడ్డలితో నరికి చంపిన సంఘటన కలకలం రేపింది. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 140 దగ్గర ఈ దారుణం జరిగింది.
నలుగురు వ్యక్తులు కిరాతకంగా నరికి చంపుతున్న ఎవరూ కూడా అపే ప్రయత్నం చేయలేదు. అయితే, హత్య అనంతరం నిందితులు వారంతా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు సమాచారం. ఈ హత్య ఓ పోలీస్ కానిస్టేబుల్ సమక్షంలోనే జరగడం ఆందోలన కలిగిస్తోంది.
మొదట నలుగురు వ్యక్తులు రోడ్డుమీద వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి తన్నారు. అతను కిందపడిపోవడంతో బాధితుడు కిందపడిపోయాడు. దీంతో తమ వెంట తెచ్చిన గొడ్డలితో అతడి మీద విచక్షణారహితంగా దాడి చేశారు. కింద రక్తపు మడుగులో పడి నిర్జీవంగా ఉన్న వ్యక్తిని ఓ వ్యక్తి గొడ్డలితో నరుకుతూనే ఉన్నాడు.
మరోవైపు హంతకుల్లో ఒకరిని పోలీసు, స్థానికులు పట్టుకున్నారు. మిగిలిన వారు పరారయ్యారు. ఆ పారిపోయిన వారు కూడా నేరుగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు తెలుస్తోంది. హత్యకు గురైన వ్యక్తిని రమేశ్గా పోలీసులు గుర్తించారు. అయితే రమేశ్ గతంలో బేగంబజార్కు చెందిన మహేశ్ అనే వ్యక్తిని ఆరు నెలల క్రితం శంషాబాద్లో మర్డర్ చేశాడు. ఈ కేసులో రమేశ్ ఉప్పర్పల్లి కోర్టులో హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో పిల్లర్ నంబర్ 138 వద్ద మాటువేసిన మహేశ్ బంధువులు అతనిపై గొడ్డలితో దాడి చేసి మట్టుబెట్టారు.