అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడులను తట్టుకోలేక …ఎట్టకేలకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ఒప్పుకుంది. అతని ఆరోగ్యం బాగోలేదని కనీసం ఇంటినుంచి కదలలేని స్థితిలో ఉన్నారని పాక్ విదేశాంగశాఖ మంత్రి ఖురేషి స్పష్టం చేశారు. మసూద్ అజర్ను ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. అతన్ని అరెస్టు చేసేందుకు కావాల్సిన ఆధారాలు తమ దగ్గర లేవన్నారు. మసూద్ను చట్టం ముందు దోషిగా కోర్టులో నిలబెట్టేందుకు ఆధారాలు కావాలన్నారు. భారత్ అటువంటి ఆధారాలను సమర్పించాలన్నారు.
పాక్ భూభాగంలో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను భారత వాయుసేన మట్టుబెట్టడంతో ఉగ్రమూకలు అవకాశం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అదును చూసి ఉగ్రవాదులు దాడులు చేసేందుకు సిద్దంగా ఉన్నారన్న సమాచారంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.ఈ క్రమంలో ఢిల్లీలోని 29 ప్రాంతాలపై టెర్రరిస్టులు టార్గెట్ చేసినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించటంతో కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకుంది. జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను టెర్రరిస్టులు టార్గెట్ చేస్తారనే హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నగరాన్ని హై అలర్డ్ జోన్ గా ప్రకటిచింది. సమస్యాత్మక ప్రాంతాలు, విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను సిద్ధం చేసింది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల రీత్యా ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో నగర పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది.