కరోనాను పూర్తిగా నియంత్రించడమే లక్షంగా నగరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉద్యమంలా కొనసాగుతోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకే రోజు, ఓకే చోట 40 వేల మందికి వ్యాక్సినేషన్ వేశారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ తో మరింత కేసుల సంఖ్య తగ్గించవొచ్చని టీ సర్కార్ భావిస్తుంది. మాదాపూర్లోని హైటెక్స్లో నిన్న నిర్వహించిన అతిపెద్ద టీకా కార్యక్రమంలో ఏకంగా 40 వేల మందికి టీకాలు వేశారు. క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా వచ్చిన వారికి వచ్చినట్టు టీకాలు వేసి పంపించారు.
ఈ కార్యక్రమంలో 700 మంది నర్సులు, 400 మంది వలంటీర్లు, 300 మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని డబ్బులు చెల్లించిన 18 ఏళ్లు పైబడిన వారికి క్యూఆర్ కోడ్ కేటాయించారు. వారు టీకా కోసం అక్కడికి రాగానే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి లోపలికి పంపారు.
ఆదివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమానికి రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, సైబరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనర్, తెలంగాణ సూపర్ స్పెషాలటీ హస్పటల్స్ అసోసియేషన్ (టిఎస్ఎస్హెచ్ఎ) ప్రధానకార్యదర్శి ఆర్.గోవింద్ హరి, ఎస్సిఎస్సి సెక్రటరీ జనరల్ వై.కృష్ణలు పాల్గొన్నారు. మొత్తంగా 40 వేల మందికి టీకాలు వేశారు. కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు.
జగన్ దిల్లీ పర్యటన వాయిదా.. కారణం అదేనా?