దేశంలో పరువు హత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెల్తున్నా ఇంకా పరువు, ప్రతిష్టలకోసం తల్లి, దండ్రులు పాకులాడుతున్నారు. పరువు కోసం కన్న బిడ్డలనే చంపుకుంటున్న దారున సంఘటనలు కోకొల్లలు. అలాంటి సంఘటనే మరోకటి చోటు చేసుకుంది.
కూతురు వేరే కులం అబ్బాయిని ప్రేమించడం, అతనితో తిరగడం ఆమె తల్లిదండ్రులు చూసి తట్టుకోలేకపోయారు. కూతురి కన్నా పరువే ముఖ్యమని భావించారు. అంతే.. కన్న కూతురు అని కూడా చూడకుండా.. ఆమె తినే అన్నంలో నిద్రమాత్రలు కలిపి.. ఆ తర్వాత హత్య చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్లో చోటు చేసుకుంది.
మాలేగాం పట్టణంలోని ఇంద్రాణి కాలనీకి చెందిన నేహాచౌదరి (18) 12వతరగతి చదువుతుంది. ఆమె కొంత కాలంగా వేరే కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో ఉంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు నాడు తన లవర్ తో కలిసి శివారు ప్రాంతాలకు వెళ్లింది. తన బాయ్ఫ్రెండ్తో కలిసి జన్మదినోత్సవం జరుపుకొని ఇంటికి వచ్చిన నేహాను ఆమె తల్లిదండ్రులు శరద్, సుమితా తన సమీప బంధువు నీలేష్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం కుమార్తెకు నిద్రమాత్రలు కలిపిన ఆహారాన్ని పెట్టారు. నిద్రలో ఉండగానే నేహాను చంపేసి శ్మశానానికి తరలించి పూడ్చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి పూడ్చి పెట్టిన శవాన్ని వెలికి తీయించి స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంలో నేహాది హత్యని తేలడంతో నేహా తల్లిదండ్రులు, ఆమె బంధువును విచారించారు.
విచారణలో ఇతర కులం యువకుడిని ప్రేమించి తప్పు చేయడంతో తామే హత్య చేశామని వారు అంగీకరించారు. దీంతో హత్య కేసు నమోదుచేసి నేహా తల్లిదండ్రులు శరద్, సుమితా, వారి సమీప బంధువు నీలేష్ను అరెస్టు చేశారు.