కేంద్రంలోని ఏన్డీఏ ముందస్తు ఎన్నికలకు సిద్ధమనే సంకేతాలు పంపింది. ముందస్తు ఎన్నికల్లో భాగంగా డిస్సెంబర్లోగాని జగనవరిలో గాని దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు సాధ్యమైనన్ని ఎక్కువ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా అడుగులు వేస్తోందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
వార్తల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 2017 మే నెలలో 13.95 లక్షల ఈవీఎంలను, 9.3 లక్షల కంట్రోల్ యూనిట్ లను, 16.15 లక్షల వీవీ పాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్) లను సమకూర్చవలసిందిగా కోరుతూ ప్రభుత్వ రంగ బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్), ఈసీఐఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)కు ఆర్డర్ ఇచ్చింది.
ఈవీఎంలు సెప్టెంబర్ నెలాఖరుకి డెలివరీ అవడానికి సిద్ధం అవుతున్నాయి. కానీ, వీవీ పాట్స్ మాత్రం ఆలస్యమయ్యేలా వుందని తెలుస్తోంది. 5.88 లక్షల యూనిట్ల వీవీ పాట్స్ మాత్రమే (మొత్తం ఆర్డర్లో 36 శాతం) ఇంతవరకు సరఫరా అయ్యాయి. నవంబర్ నెలాఖరుకి మొత్తం యూనిట్స్ సరఫరా అవుతాయని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీవీ పాట్స్ లేనిదే నిర్వహించడం కుదరదు. అందుకే దేశవ్యాప్త ఎన్నికలను 2019 జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది.
భారీగా ఈవీఎంలను ఆర్డరిచ్చిన విషయాన్ని ఈసీ అధికారులు వెల్లడించారు. ఈసీ నుంచి వెలువడిన ఆర్డర్ ను విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు, జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.