తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఒకవైపు అధికార బిఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో కేసిఆర్ ఉంటే.. మరోవైపు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ ను ఎదుర్కొనే పనిలో ఒకింత బీజేపీ ముందుందనే చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని చెప్పుకుంటున్న కమలనాథులు.. బిఆర్ఎస్ ను చిక్కుల్లో నేట్టేందుకు విశ్వ ప్రయత్నలే చేస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో కాస్త మెరుగ్గానే ఉంది. దీంతో అధికారం చేజిక్కించుకునేందుకు ఈ సారి ఎన్నికలే సరైనవని భావిస్తున్నారు కమలనాథులు. .
దాంతో బిఆర్ఎస్ ను డిఫెన్స్ లో నేట్టేందుకు పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ కొత్త చర్చలకు తావిస్తోంది కాషాయ దళం. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని కమలనాథులు పదే పదే చెబుతున్నారు. అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలను బిఆర్ఎస్ మాత్రం లైట్ తీసుకుంటోంది.. అలాంటిదేమీ లేదని ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పలువురు బిఆర్ఎస్ నేతలతో పాటు కేటిఆర్ కు ఆ మద్య వివరణ ఇచ్చారు. అయినప్పటికి ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చను కమలనాథులు మాత్రం ఆపడంలేదు.
ఇక ఇటీవల బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందస్తు ఎన్నికల విషయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసి.. మేలో ఎన్నికలకు వెలతారని, కర్నాటకతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ ముందస్తు ఎన్నికలపై చర్చ మరోసారి హాట్ టాపిక్ అయింది. గత ఎన్నికల సమయంలో కూడా కేసిఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన సంగతి విధితమే. దాంతో ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలపై పదే పదే చర్చని లేవదీస్తున్నాయి. అయితే కేసిఆర్ వ్యూహాలు, ప్రణాళికలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది ఊహించడం కష్టం.. దాంతో కేసిఆర్ ఎలాంటి ప్లాన్ సిద్దం చేసుకున్నా తాము మాత్రం ఎన్నికలకు సిద్దంగా ఉండాలని కమలనాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెలంగాణలో గత ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి
టార్గెట్ తెలంగాణ.. పవన్ ప్లాన్ ఏంటి ?