కేరళ రాష్ట్రంలో ‘ప్లాస్మోడియం ఓవల్'( Plasmodium Ovale ) అనే కొత్త రకం మలేరియాను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. ఈ వ్యాధి సుడాన్ నుంచి వచ్చిన ఓ జవాను సోకినట్లు గుర్తించామని చెప్పారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
భారత్లో కరోనా వైరస్ తొలి కేసు కూడా కేరళలోనే వెలుగుచూసింది. త్రిస్సూర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి వూహాన్ నుంచి వచ్చిన క్రమంలో అతనికి వైరస్ సోకినట్లు గుర్తించారు. అలాగే.. 2018లో కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో కొత్త రకం మలేరియాపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.
రాష్ట్రంలో కొత్త రకం మలేరియా ప్లాస్మోడియం ఓవల్ను గుర్తించాం. కన్నూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవాను శరీరంలో ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. అతను సుడాన్ నుంచి వచ్చాడు. సరైన సమయంలో చికిత్స అందించటం, నివారణ చర్యలు చేపట్టటం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోగలిగాం అని మంత్రి అన్నారు.