వరంగల్: రాష్ట్రానికి రాజధాని గుండె లాంటిది. అన్ని హంగులు,ఆర్బాటాలతో పాటు రాజకీయ, సినీ విశేషాలన్నీ ఇక్కడే ఉంటాయి. రాష్ట్ర ప్రజలందరి అవసరాలను తీర్చే ఏర్పాటు, వెసులుబాటు ఉంటుంది. ఈ కోవలోనే తెలంగాణకు రాజధాని హైదరాబాద్ అంత విలువైనది. దేశంలోని టాప్ 5 ప్రముఖ నగరాల్లో భాగ్యనగరం ఒకటి.
మిగతా తెలంగాణ ప్రాంతమంతా ఒక ఎత్తైతే హైదరాబాద్ ఒకెత్తు. అయితే తెలంగాణలో మరో హైదరాబాద్ లాంటి నగర అభివృద్ధికి రంగం సిద్దమౌతోందా! రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ మాటలను బట్టి అలానే ఉంది. వరంగల్ నగరాన్ని రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తామని కెటీఆర్ అన్నారు. రానున్న ఐదేళ్లలో వరంగల్ నగర అభివద్ధికి రెండు వేల కోట్ల రూపాయిల అందనున్నాయని ఆయన చెప్పారు.
వరంగల్లో జరిగిన కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) చైర్మన్గా మర్రి యాదవరెడ్డి ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. త్వరలో వరంగల్లో టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయబోతున్నామని, ఇప్పటివరకు 9 కార్పోరేషన్ చైర్మన్లను నియమిస్తే అందులో వరంగల్ జిల్లాకు చెందిన నలుగురికి అవకాశమివ్వడం జరిగిందని చెప్పారు. ఇది వరంగల్పై సీఎం కేసీఆర్కున్న ప్రత్యేక ప్రేమకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. దీంతో తెలంగాణలో మరో హైదరాబాద్ లాంటి నగరం తయారు కాబోతోందని పలువురి మధ్య చర్చలు మొదలయ్యాయి.