కృష్ణా జిల్లా బావులపాడులో తాను సహజీవనం చేస్తున్న బ్యూటీషియన్ పిల్లి పద్మపై హత్యాయత్నం చేశాడని భావిస్తున్న నూతన్ నాయుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు తొలుత పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని భావించినప్పటికీ…అతన్ని ఎవరో హత్య ఏసి పట్టాలపై పడేసి ఉంటారన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
పద్మపై గతవారంలో నూతన్ దాడి చేసి, దారుణంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆమెకు మత్తిచ్చి, ఒంటిపై బట్టలన్నీ తీసేసి, కత్తితో పలుమార్లు పొడవడంతో పాటు, చేతులు నరికి, నుదుటిపై ‘ఎస్’ ఆకారాన్ని చెక్కి, ఆమె చనిపోయిందని భావించి, అక్కడి నుంచి పారిపోయాడు. ఆపై రెండు రోజుల తరువాత కొన ఊపిరితో ఉన్న పద్మను ఆమె భర్త గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు వెలుగులోకి వచ్చింది.
పద్మ తన వాగ్మూలంలో సుబ్బయ్య అనే వ్యక్తి పేరు చెప్పగా, అతను ఎవరన్న విషయంపైనా విచారిస్తున్నారు. ఈ కేసులో సుబ్బయ్య రెండో నిందితుడని చెప్పిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నూతన్ కుమార్ వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా, ఆయన భార్యకు కబురు పెట్టగా, ఆమె వచ్చి అతను తన భర్తేనని గుర్తించింది. నూతన్ ను సుబ్బయ్య హత్య చేసి ఉండవచ్చన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. పద్మ చేతిపై ఉన్న ‘ఎన్’ అన్న పచ్చబొట్టును కత్తితో చెరిపివేయడం, ఆపై నుదుటిపై ‘ఎస్’ అన్న అక్షరాన్ని రాయడం వెనుక ఉన్న మిస్టరీ, సుబ్బయ్యను అరెస్ట్ చేస్తే వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు.
నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నూతన కుమార్, పద్మ మధ్య ఏడాదిగా తీవ్ర విభేదాలు తలెత్తాయి. పశ్చిమగోదావరి జిల్లా పెడపాడులో ఇప్పటికే నూతన కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదై ఉంది. హనుమాన్ జంక్షన్ పోలీసులకు గతంలో నూతన్పై పద్మ ఫిర్యాదు కూడా చేసింది. ఆపై పద్మ రాజీ పడింది. గతంలో ఒకసారి నూతన్ కుమార్ ఆత్మహత్యా యత్నం కూడా చేసుకున్నట్లు విచారణలో తేలింది. పద్మ భర్త పేరు సూర్యనారాయణ కాబట్టి ‘ఎస్’ అనే అక్షరం బ్లేడ్తో రాసి, ‘ఎన్’ అనే అక్షరం కోసేస్తే అది పద్మ భర్తే చేశాడని భావిస్తారని నూతన కుమార్ అలా చేసి ఉండవచ్చునని పోలీసులు నిర్దారణకు వచ్చారు.