లాలూ ప్రసాద్ యాదవ్. ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఏం చేయకుండా ఊరికే మాట్లాడినా అలాగే ఉంటుంది. బీహార్ నుంచి రాజ్యసభకు ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్ధానాల్లో ఒక స్ధానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. రాష్ట్రంలో అందరూ అలాగే జరుగుతుందనుకున్నారు కూడా. అయితే అలా జరిగితే లాలూ ఎందుకవుతారు.
అందుకే ఆయన తన భార్యని కాదని ఈ ఎన్నికల్లో తన కుమార్తె మిసా భారతిని ఎంపిక చేశారు. ఊహించని ఈ పరిణామానికి అటు పార్టీ పెద్దలతో పాటు ఆయన భార్య రబ్రీదేవి కూడా ఖంగుతిన్నారు. మిగిలిన మూడు స్ధానాలలో జెడియు నేత శరద్ యాదవ్, ప్రముఖ న్యాయవాది రాం జెఠల్మానీ, నితీష్ కుమార్ అనుచరుడు ఆర్సీపి సింగ్ లను ఎంపిక చేశారు.
అవినీతి కేసుల్లో తన పక్షాన నిలిచి వాదించినందుకు రాంజెఠ్మలానికి టిక్కట్ ఇచ్చినట్లు లాలూ ప్రసాద్ చెప్పారు. రాం జెఠ్మలానీ ఆదివారం నాడే ఆర్జెడీలో చేరారు. ఇక్కడి నుంచి బిజెపి అభ్యర్ధిగా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాల్ నారాయణ్ సింగ్ కు ఆ పార్టీ సీటు కేటాయించింది. ఈ ఐదు స్ధానాలు జులై నెలలో ఖాళీ అవుతాయి.