ఉత్తర కొరియా, అమెరికాల మద్య మాటల స్థాయి దాటిపోయి చేతుల దాకా వచ్చింది. ఐక్యరాజ్యసమితి, అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా అణుపరీక్షలను నిర్వహిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అణుపరీక్షలు నిర్వహిస్తూ, మానవాళి మొత్తానికి ముప్పుగా పరిణమిస్తున్న ఉత్తర కొరియా… రెచ్చగొట్టే వైఖరిని మానుకోకపోతే ఆ దేశాన్ని ‘సర్వ నాశనం’ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అవన్నీ లెక్క చేకుండా మరో సహాసానికి ఒడిగట్టింది.
నిత్యం యుద్ధకాంక్షతో రగిలిపోతున్న ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్… అత్యంత రహస్యంగా మరో కార్యక్రమాన్ని చేపట్టారు. అణుజలాంతర్గామిని అత్యంత రహస్యంగా ఉత్తర కొరియా రూపొందిస్తోందని.. దీని నిర్మాణం కోసం చైనా, రష్యాలకు చెందిన అత్యున్నత స్థాయి ఇంజినీర్లు పని చేస్తున్నారని జపాన్ మీడియా వెల్లడించింది. ఉత్తర కొరియాలోని నాంపో నావెల్ షిప్ యార్డులో దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొంది. 2020 నాటికి జలాంతర్గామి నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది.
అణుజలాంతర్గామిని నిర్మించడం చాలా కష్టంతో కూడుకున్న పనితోపాటు … అత్యంత ఖర్చు అవుతుంది. ఉత్తర కొరియా మాత్రం దాన్ని చాలా సునాయాసంగా తయారు చేయగలుగుతోందని జపాన్ మీడియా పేర్కొంది. చమురు అవసరం లేకుండానే ఎక్కువ కాలం నీటిలోనే ఉండేలా, దీన్ని రూపొందిస్తున్నారని చెప్పంది. ఇది అత్యంత శక్తివంతమైన జలాంతర్గామి అని తెలిపింది.