ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో తిరుగులేని ఆధిక్యం సాధించింది. దీంతో ఆపార్టీ అధినేత జగన్ సీఎంగా ఈనెల 30న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే సర్వేలపై వందలకోట్లు బెట్టింగులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ గెలుస్తుందని రూ.12లక్షలు బెట్టింగ్ కట్టిన వ్యక్తి టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది.
జిల్లాలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో కంఠమనేని వీర్రాజు తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఈ నేపథ్యంలో ఏపీలో రెండోసారి కూడా టీడీపీ 110-130 సీట్లతో అధికారంలోకి వస్తుందని లగడపాటి సహా పలు సర్వేలు తేల్చాయి. దీంతో టీడీపీ గెలుస్తుందని రూ.12 లక్షల పందెం కాశాడు.
గురువారం వెలువడిన ఫలితాల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓటమిపాలయ్యి వైసీపీ 151 స్థానాల్లో గెలుపొందడంతో వీర్రాజు తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఓవైపు పార్టీ ఓటమిపాలు కావడం, మరోవైపు రూ.12 లక్షలు ఆవిరైపోవడంతో ఈరోజు ఉదయం పురుగుల మందు తాగాడు.ఆయన్ను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బెట్టింగ్లో డబ్బులు పోవడంతోనె ఆత్మహత్య చేసుకున్నాడని కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.