హైదరాబాద్లో కల్తీ ఆహారంపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మెహిదీపట్నంలో ఉన్న ఓ ఐస్ క్రీమ్ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించి, ప్రమాదకరమైన విషయాలను బయటపెట్టారు.
మెహిదీపట్నంలోని అలియా ఐస్ క్రీమ్ పార్లర్ కేంద్రంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది.
పరిశీలనలో భాగంగా, ఐస్ క్రీమ్స్ తయారీలో హానికర రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవి ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం కలిగించే అవకాశముందని అధికారులు తెలిపారు.ఈ కేసులో ప్రధాన నిందితుడైన ముషారఫుద్దీన్ (24) ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రతిరోజూ వినియోగించే ఆహార పదార్థాల్లో ఇలాంటి కల్తీ జరుగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆహార భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
