ఏపీకీ వరద ప్రదాయని పోవలరం ప్రాజెక్టు. పనులు మొదలు పెట్టినాలనుంచి అన్నీ అడ్డంకులే. విభజన తర్వాత పనులు త్వరగా జరిగిపూర్తవుతాయనుకుంటే మొదటికే మోసం వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు పనులు గందరగోళంలో పడటంతొ పనులు ముందుకు సాగడంలేదు. అయితే ఇప్పుడు తాజాగా పోలవరం పనులు నిలిచిపోనున్నాయి.
2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి కనీసం గ్రావిటీ ద్వారా నీరందించాలని ఏపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సబ్ కాంట్రాక్టు సంస్ధలకు డబ్బులు చెల్లించటానికి ప్రధాన కాంట్రాక్టర్ వద్ద డబ్బులు లేవు. దాంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి . ఇదలా ఉంటే ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ పై కెనరా బ్యాంకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు దివాలా పిటిషన్ ను దాఖలు చేసింది. ఆ సంస్థ తమకు రూ. 725 కోట్లు బకాయి పడిందని, వెంటనే కార్పొరేట్ ఇన్ సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టి తమ బకాయిలు ఇప్పించాలని కోరింది. తమకు డిసెంబర్ 22 నాటికి రూ. 489 కోట్లు చెల్లించాల్సివుందని, ఆ మొత్తం కట్టడంలో సంస్థ విఫలమైందని పేర్కొంది.
మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తుపై ఆందోళన కలిగించేలా కెనరా బ్యాంకు తీసుకున్న ఈ చర్యతో ఏపీ ప్రభుత్వం సైతం డోలాయమానంలో పడింది. ఒకవేళ నేషనల్ లా ట్రైబ్యునల్, ట్రాన్స్ ట్రాయ్ ని దివాలా తీసిన సంస్థగా ప్రకటిస్తే, పోలవరం పనులు ఎక్కడివక్కడ నిలిచే ప్రమాదం ఉంది. తిరిగి కాంట్రాక్టులను పిలవాల్సిందే. ట్రాన్స్ ట్రాయ్ కి మరే బ్యాంకు నుంచి అప్పు పుట్టదు. ప్రాజెక్టుకు కీలకమైన కాంక్రీటు పనులు క్లిష్టతరమవుతాయి. స్లిప్ వే, స్పిల్ చానల్ పనులు సాగవు.
పోలవరం పనులను వేగంగా పూర్తి చేయాలని ఒకవైపు చంద్రబాబునాయుడు ఆతురత పడుతుంటే మరోవైపు కేంద్రం చాలా నెమ్మదిగా ఉంది. స్పిల్ వే పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కేంద్రం బిల్లులు చెల్లించని కారణంగానే పనులు ఆగిపోతున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. తమకు రాష్ట్రం సరిగా లెక్కలు చెప్పని కారణంగానే బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందంటూ కేంద్రం ఎదురు దాడి చేస్తోంది. రెండింటిలో ఏది నిజమో స్పష్టంగా తెలీదు కానీ పోలవరం పనులు మాత్రం నిలిచిపోయాయన్నది వాస్తవం.