సూపర్స్టార్ రజనీకాంత్.. రాజకీయరంగ ప్రవేశంపై వెనక్కి తగ్గారు. ఆరోగ్యకారణల దృష్ట్యా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. రజనీ త్వరగా కోలుకునేందుకు వైద్యులు కొన్ని సూచనలు చేశారు. వారం రోజుల పాటు రజనీ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కొవిడ్ సోకే అవకాశం ఉన్న ఏ కార్యక్రమంలోనూ పాల్గొన వద్దని సూచించారు. అదే సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని తెలిపారు. గతంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.. కానీ ఇప్పుడు కాదు. నూతన పార్టీ ఆలోచనను తాత్కాలికంగా విరమించా. ఆరోగ్యం ప్రాధాన్యమని ఆత్మీయులు సూచించారు. అనారోగ్యం పార్టీ ఆలోచనను కాస్త వెనక్కి నెట్టింది. నిజం మాట్లాడటానికి ఎప్పుడూ వెనుకాడను. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవ నిరంతరం సాగుతోంది. నా నిర్ణయం అభిమానులను బాధపెట్టొచ్చు.. నన్ను క్షమించాలి అని రజనీకాంత్ తెలిపారు.