తెలుగుదేశం నేతలు ఏ విషయాన్నీ వదిలిపెట్టేలా లేరు. ఓటుకు నోటు వ్యవహారం నుంచి బయట పడటానికో ఏమో కానీ.. వారు ప్రతి విషయం గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, గవర్నర్ నరసింహన్ కానీ ఏ విషయంలో దొరికినా వారిపై విరుచుకుపడటానికే వీరు ప్రాధాన్యతను ఇస్తున్నారు.
మరి ఇలా చేయడంలో.. తెలుగుదేశం నేతల తీరు కొంత విడ్డూరంగా కూడా ఉంది!
తాజాగా మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కు సాష్టాంగ నమస్కారం చేశాడు అని.. దాని అర్థం ఏమిటి? అని ప్రశ్నించాడు! గవర్నర్ తో సమావేశం అయిన సమయంలో కేసీఆర్ ఇలా సాష్టాంగ నమస్కారం చేశాడు అని.. దీని అంతరార్థం ఏమిటి అని ఏపీ మంత్రిగారు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇదేదో వ్యూహాత్మకం అని తెలుగుదేశం నేతలు అంటున్నారు.
తెలుగుదేశం నేతల మాటలు వింటే… నమస్కారం చేయడంలో.. కూడా వ్యూహాలు ఉంటాయా? అది కూడా తప్పు అవుతుందా? అనే సందేహఃఆలు ఎవరికైనా వస్తాయి. తెలుగుదేశం నేతలు ప్రతిదాన్నీ ఏదో వివాదంగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు కలిగిస్తాయి. దీనికి కారణం మాత్రం తెలుగుదేశం నేతలే!