స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గే సెక్స్ నేరం కాదని స్పష్టం చేస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగనించలేమని కోర్టు తెలిపింది.
వ్యక్తిగత స్వేచ్ఛను అందరూ గౌరవించాలని చీఫ్ జస్టిస్ తన తీర్పులో తెలిపారు. లెస్బియన్స్, గేలకు (ఎల్జీబీటీ) సమాన హక్కులు ఉంటాయని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ వర్తిస్తుందని తెలిపారు. సెక్షన్ 377 ఏకపక్షంగా ఉందని అభిప్రాయపడింది. వ్యక్తిగతంగా తమకు ఇష్టమైన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని తెలిపింది. భావవ్యక్తీకరణను నిరాకరించడమంటే అది మరణంతో సమానమని వ్యాఖ్యానించింది. పరస్పర అంగీకారంతో జరగే స్వలింగ సంపర్కం నేరం కాదని తుది తీర్పును వెలువరించింది. తద్వారా సెక్షన్ 377పై సుదీర్ఘ కాలంగా (150 ఏళ్లు) సాగుతున్న వివాదానికి స్వస్తి పలికింది.
ఇప్పటి వరకు స్వలింగ సంపర్కం సెక్షన్ 377 కింద ఉంది. ఈ సెక్షన్ కింద ప్రకృతికి విరుద్ధంగా ఏ మహిళ అయినా, పురుషుడు అయినా స్వలింగ సంపర్కంలో పాల్గొంటే నేరంగా భావిస్తూ వచ్చారు. నేరం రుజువైతే జీవితకాల శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు సహా వివిధ వర్గాల వాదనలను విన్నది. అనంతరం గత జులై 17న తీర్పును రిజర్వ్లో ఉంచింది. మరోవైపు సెక్షన్ 377 చట్టబద్ధతపై నిర్ణయాన్ని కేంద్రం కూడా అత్యున్నత న్యాయస్థానం విచక్షణకు వదిలేసింది.
ఈ సెక్షన్ను సవాల్ చేస్తూ నాజ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 2001లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పరస్పర అంగీకారంతో ఒకే లింగానికి చెందిన ఇద్దరి మధ్య జరిగే లైంగికచర్య నేరం కాదని ఢిల్లీ హైకోర్టు 2009లో తీర్పు చెప్పింది. ఈ తీర్పును కొట్టి వేసిన సుప్రీంకోర్టు మళ్లీ తీర్పును వెలువ రించింది.
అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ ఏకగ్రీవంగా ఈ తీర్పును వెలువరించడం విశేషం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ ఖాన్విలకర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పు వెలువరించింది.