పవర్ చేతిలో ఉన్న కొందరు నేతలు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని చెప్పటానికి తాజా ఉదంతం ఒక పెద్ద ఉదాహరణగా చెప్పాలి. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు..ఆ ఎంపీ తీరును పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు. విమానంలో తాను కోరిన టికెట్ ఇవ్వలేదన్న కోపంతో ఎయిరిండియా సిబ్బందిని పాతిక చెప్పు దెబ్బలు కొట్టినట్లుగా చెప్పుకోవటం సంచలనంగా మారింది.
ఈ రోజు ఉదయం (గురువారం) శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియావిమానంలో పుణె నుంచి దేశరాజధాని ఢిల్లీకి వచ్చారు. బిజినెస్ క్లాస్ టికెట్ అడగ్గా.. విమాన సిబ్బంది ఎకానమీ క్లాస్ టికెట్ ఇచ్చారు. తనకిచ్చిన టికెట్ మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యారు సదరు ఎంపీ. బిజినెస్ క్లాస్ టికెట్ లేని నేపథ్యంలో ఎకానమీ క్లాస్ టికెట్ ఇచ్చిన విషయాన్ని అధికారులు వివరించినా.. ఆయన పట్టించుకోకపోవటమే కాదు.. సిబ్బందిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.
ఈ సందర్భంగా తీవ్ర ఆవేశానికి గురైన ఎంపీ.. విమాన సిబ్బందిని చెప్పుతో కొట్టిన వైనం అందరిని షాక్ కుగురి చేసింది.జరిగిన ఉదంతం గురించి ఏ మాత్రం పశ్చాతాపం ప్రదర్శించని సదరు ఎంపీ.. ‘‘అవును.. పాతిక చెప్పుదెబ్బలు కొట్టాను. ఎయిరిండియా సిబ్బంది నాతో దురుసుగా వ్యవహరించారు. గతంలోనూ ఇదేతీరులో వ్యవహరించారు. అప్పట్లో ఫిర్యాదు చేశాను. ఈసారి మాత్రం సహనం కోల్పోవాల్సి వచ్చింది’’ అని బలుపుగా వ్యాఖ్యానించారు.
ఈ ఉదంతంపై ఎయిరిండియా వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎంపీ తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఆయనపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదంతంపై కేంద్ర విమానయాన మంత్రిఅశోక్ గజపతి రాజు తీవ్రంగా ఖండించారు. ఎంపీ తీరును తప్పు పట్టారు.