మహారాష్ట్ర ప్రభుత్వంలో లుక లుకలు ఏర్పడ్డాయా? శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయా? త్వరలో శివసేన, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదా? ప్రస్తుతం అక్కడ అటువంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. కొంతకాలంగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీ పెద్దలను కలుసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్, ఎన్సీపీతో రాజకీయ విబేధాలు ఉన్నాయని వ్యాఖ్యనించారు. దీంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. మహా వికాస్ అఘాడీ (MVA) లో విబేధాలు వచ్చాయంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇదిలా ఉంటే తన కదలికలపై శివసేన, ఎన్సీపీలు నిఘా పెడుతున్నాయని ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె లోనోవాలో మద్దతుదారులనుద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం ఉద్దవ్ థాక్రే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్,హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ప్రతిరోజు ప్రత్యేకంగా సమావేశమవుతారు.ఈ సందర్భంగా వీరు కాంగ్రెస్ నాయకుల కార్యకలాపాలపై చర్చిస్తారు. సీక్రెట్ గా నివేదికలు తెప్పించుకుంటారు.. అంటూ నానా పటోలే వ్యాఖ్యానించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీచేయగా.. ముఖ్యమంత్రి పదవి విషయంలో పేచీ రావడంతో.. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో చేతులు కలిపిన విషయం తెలిసిందే.బీజేపీ అధినాయకత్వం గవర్నర్ సాయంతో కొంత హైడ్రామా క్రియేట్ చేసింది. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉద్దవ్ను సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టారు. ప్రస్తుతం ఈ కూటమిలో లుకలుకలు మొదలైనట్టు కనిపిస్తోంది.