రోజురోజుకు నేరాలు వింతగా జరుగుతున్నాయి. టీవీ రీమోట్ ఇవ్వలేదని.. సెల్ఫోన్ కొనివ్వలేదని.. టీచర్ తిట్టాడని ఆత్మహత్యలో.. హత్యలో చోటుచేసుకుంటాయి. అయితే ఈ నేరాల్లో తమను తాము బలి చేయడమో ఇతరులను బలి చేయడమో జరుగుతుంటాయి. ఇప్పుడు భోజనం పెట్టన్నందుకు కన్నతల్లిని రోకలిబండతో మోదీ చంపిన కొడుకు ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
అన్నం పెట్టలేదనే కోపంతో తల్లినే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో చంపేశాడు. ముస్త్యాల గ్రామానికి చెందిన మెరుగు రమ (45) భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకులతో కలిసి ఉంటూ కూలీ పని చేస్తుండేది. పెద్ద కొడుకు ప్రశాంత్ చిన్నాచితక పనులు చేస్తూ ఉంటాడు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ప్రశాంత్ తన తల్లిని అన్నం పెట్టమని అడిగాడు.
‘నువ్వేం పని లేకుండా తిరుగుతున్నావ్.. అసలు అన్నం వండనేలేదు’ అని తల్లి రమ సమాధానం ఇచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రశాంత్ ఆగ్రహంతో తల్లి రమ తలపై రోకలి బండతో బలంగా బాదాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను గోదావరిఖని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.